rajamudranews.com
Newspaper Banner
Date of Publish : 23 April 2026, 7:21 pm Posted by : RAJAMUDRA NEWS

ఇంటి బారిన వెలుగై ఉన్న కుమారుడు… కరెంటు షాక్‌తో క్షణాల్లో ఆరిపోయాడు

బీర్కూర్, రాజముద్ర, న్యూస్:

బీర్కూర్ మండలం, కిష్టాపూర్ గ్రామం లో
కుటుంబానికి అండగా నిలవాలని కష్టపడుతున్న యువకుడి జీవితం క్షణాల్లో చిగురుటాకులా రాలిపోయింది. మండలంలోని కిష్టాపూర్ గ్రామానికి చెందిన కుమ్మరి మహేష్ (27) అనే యువకుడు కరెంటు మోటార్‌ను చెక్ చేస్తుండగా విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ దుర్ఘటన గ్రామాన్ని శోకసంద్రంలో ముంచేసింది. ఇంటి పనుల నిమిత్తం మోటార్‌ను పరిశీలిస్తున్న మహేష్, ప్రమాదవశాత్తూ విద్యుత్ ప్రవాహానికి గురయ్యాడు. సహాయం అందించేలోపే అతని ప్రాణాలు కోల్పోవడం కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టింది. ఇంటికి అండగా ఉన్న మహేష్ మృతి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులను కన్నీరుమున్నీరుగా చేసింది.ఈ ఘటన తెలిసిన వెంటనే గ్రామస్తులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని సంతాపం తెలిపారు. నవ్వుతూ తిరిగే మహేష్ ఇక లేడనే వార్తనుగ్రామం జీర్ణించుకోలేకపోతోంది.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం తక్షణ సహాయం అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు.