– 14-15 ఏళ్ళ లోపు బాలికలు టీకా తీసుకోవాలి
– డా. రుబీనా
భీమదేవరపల్లి, రాజముద్ర డెస్క్:
హెచ్పీవీ వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా భవిష్యత్తులో వచ్చే గర్భాశయ క్యాన్సర్ ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించవచ్చని వంగర వైద్యులు డాక్టర్ రుబీనా అన్నారు. మండలంలోని వంగర గ్రామంలో ఉన్న పీవీ రంగారావు గురుకుల పాఠశాలలో గురువారం హెచ్పీవీ (హ్యూమన్ పాపిలోమా వైరస్) వ్యాక్సిన్పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థినులకు ఆరోగ్య రక్షణలో టీకాల ప్రాధాన్యతను వైద్యులు వివరించారు. ఈ సందర్భంగా వైద్యురాలు డా. రుబీనా మాట్లాడుతూ, హెచ్పీవీ వైరస్ మహిళల్లో గర్భాశయ క్యాన్సర్కు ప్రధాన కారణమని తెలిపారు. చిన్న వయసులోనే ఈ వైరస్ సంక్రమణకు అవకాశం ఉండటంతో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరమని ఆమె పేర్కొన్నారు. హెచ్పీవీ వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా భవిష్యత్తులో వచ్చే గర్భాశయ క్యాన్సర్ ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించవచ్చని వివరించారు.
ప్రత్యేకంగా 9 నుంచి 14 సంవత్సరాల మధ్య వయస్సు గల బాలికలు ఈ టీకాను తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు.ఈ వయస్సులో టీకా తీసుకుంటే ఎక్కువ ప్రభావవంతంగా పనిచేస్తుందని. జీవితకాలంలో ఆరోగ్య రక్షణకు దోహదపడుతుందని చెప్పారు.
వంగర ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో హెచ్పీవీ వ్యాక్సిన్ ఉచితంగా అందుబాటులో ఉందని, అర్హులైన బాలికలు ఆలస్యం చేయకుండా టీకా వేయించుకోవాలని సూచించారు. తల్లిదండ్రులు కూడా ఈ విషయంపై అవగాహన పెంచుకుని తమ పిల్లల ఆరోగ్య భద్రత కోసం ముందడుగు వేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో డా. రహ్మాన్, పాఠశాల ప్రిన్సిపాల్ అఫ్రీన్, నర్సింగ్ సిబ్బంది హారిక,ఆశా కార్యకర్త రజిత, తదితరులు పాల్గొన్నారు.
