– రిజిస్ట్రేషన్ల నిలిపివేతపై రోడ్డెక్కిన వేలాది కుటుంబాలు
– ప్రభుత్వం న్యాయం చేసేంతవరకు నిరసనలు తెలుపుతూనే ఉంటాం
బోడుప్పల్, రాజముద్ర న్యూస్: మల్కాజ్గిరి నగరపాలక సంస్థ పరిధిలోని బోడుప్పల్ సర్కిల్ పరిధిలో వక్ఫ్ భూముల పేరుతో సాగుతున్న రిజిస్ట్రేషన్ల నిలిపివేతపై బాధితులు ఉగ్రరూపం దాల్చారు. తమ సొంత స్థలాలకు హక్కులు కల్పించాలని డిమాండ్ చేస్తూ కాలనీ వాసులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ మేరకు ఆదివారం బోడుప్పల్ సర్కిల్ చెంగిచెర్ల ఆర్ఎన్ఎస్ కాలనీ నుండి అంబేద్కర్ విగ్రహం వరకు పెద్ద ఎత్తున పలు కాలనీల ప్రజలు ర్యాలీగా బయలుదేరి నిరసనలు ప్రదర్శించారు. సుమారు పదివేల కుటుంబాలకు న్యాయం జరిగేలా కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచించాలని కోరారు.
రిజిస్ట్రేషన్ల పోరాట సమితి ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసన ప్రదర్శనలో వివిధ కాలనీలకు చెందిన మహిళలు, చిన్నారులు, వృద్ధులు, సంక్షేమ సంఘాల నాయకులు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. గత పదేళ్లుగా సాగుతున్న ఈ అన్యాయంపై ప్రభుత్వానికి తమ గోడును విన్నవించుకుంటూ ప్లకార్డులతో నిరసన తెలిపారు.
పదేళ్లుగా తప్పని పీడకల:
2015 సంవత్సరం నుండి ఈ ప్రాంతంలో రిజిస్ట్రేషన్ల ప్రక్రియను నిలిపివేశారని, దీనివల్ల సుమారు పదివేల కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. తాము కష్టపడి సంపాదించుకున్న సొమ్ముతో కొనుగోలు చేసిన భూములను అమ్ముకోవడానికి గానీ, పిల్లల పెళ్లిళ్లకు లేదా అత్యవసర అవసరాలకు వాడుకోవడానికి వీలు లేకుండా పోయిందని వాపోయారు. అధికారుల చుట్టూ, నాయకుల చుట్టూ తిరిగినా ఫలితం లేదని, తమ ఆస్తులపై తమకే హక్కు లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నాడు హామీ ఇచ్చి.. నేడు విస్మరించి:
ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న సమయంలో తమ ప్రాంతాన్ని సందర్శించి, అధికారంలోకి రాగానే ఈ సమస్యను పరిష్కరిస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారని బాధితులు గుర్తు చేశారు. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చాక తమ సమస్యను పట్టించుకోకుండా గాలికి వదిలేశారని మండిపడ్డారు. ప్రతిపక్ష పార్టీల నాయకులకు కూడా అనేకమార్లు విన్నవించినా ఎవరూ చొరవ చూపడం లేదని, రాజకీయ నాయకులు ఎన్నికల సమయంలో మాత్రమే కనిపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమను వక్ఫ్ బోర్డు బాధితులుగా మార్చిన ఈ నిబంధనలను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు.
ఉద్యమం ఉధృతం చేస్తాం:
తమ నిరసన కేవలం ప్రారంభం మాత్రమేనని, ప్రభుత్వం స్పందించి రిజిస్ట్రేషన్ల ప్రక్రియను వెంటనే ప్రారంభించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. వేలాది మంది ప్రాణాలతో ముడిపడి ఉన్న ఈ భూ సమస్యను మానవతా దృక్పథంతో పరిష్కరించాలని కోరారు. న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో రిజిస్ట్రేషన్ల పోరాట సమితి ప్రతినిధులు, వివిధ కాలనీల సంక్షేమ సంఘాల బాధ్యులు, స్థానిక కాలనీల వాసులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.