అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలి
మాజీ జెడ్పిటిసి వంగ రవి
భీమదేవరపల్లి, రాజముద్ర డెస్క్:
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135 వ జయంతి సందర్భంగా ముల్కనూర్ ప్రజా గ్రంథాలయంలో మంగళవారం నాడు ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి, ఆయన సేవలను స్మరించుకున్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ జెడ్పిటిసి వంగ రవి, డాక్టర్ ఎదులాపురం తిరుపతి, మాజీ సర్పంచ్ మాడుగుల కొమురయ్య హాజరయ్యారు. వారు మాట్లాడుతూ, అంబేద్కర్ సమాజంలోని అణగారిన వర్గాల అభ్యున్నతికి చేసిన కృషి అపారమని కొనియాడారు. రాజ్యాంగం ద్వారా సమాన హక్కులు, సామాజిక న్యాయం అందించిన మహనీయుడిగా ఆయనను స్మరించారు.
అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని, ముఖ్యంగా యువత ఆయన చూపిన మార్గంలో నడిచి సమాజ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. విద్య, సమానత్వం, స్వాభిమానం అనే విలువలను పెంపొందించుకోవడం ద్వారానే సమాజం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సిబ్బంది, స్థానిక నాయకులు, విద్యార్థులు , గ్రామస్థులు పాల్గొని అంబేద్కర్ కి ఘనంగా నివాళులు అర్పించారు.
