ప్రతి నెలలో ఒక రోజు ప్రజా ప్రతినిధులతో “స్వచ్ఛ వంగర” ప్రోగ్రాం
వంగర గ్రామ సర్పంచ్ గజ్జల సృజన రమేష్
భీమదేవరపల్లి, రాజముద్ర డెస్క్
గ్రామపంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో ప్రతినెల నిర్వహిస్తున్న “స్వచ్ఛ వంగర” కార్యక్రమంలో భాగంగా ఆదివారం నాడు వంగర గ్రామంలోని రెండో వార్డులో విస్తృత శుభ్రత కార్యక్రమం చేపట్టబడింది. ఈ కార్యక్రమం వంగర గ్రామ సర్పంచ్ గజ్జల సృజన రమేష్ నాయకత్వంలో జరిగింది.రెండో వార్డులోని రహదారులు, కాలనీలు, కాలువలు మరియు పరిసర ప్రాంతాలలో పేరుకుపోయిన చెత్తను తొలగించి పారిశుద్ధ్య సిబ్బంది సహకారంతో శుభ్రపరిచారు. గ్రామాన్ని పరిశుభ్రంగా, ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దడం లక్ష్యంగా ప్రతి నెలలో ఒక రోజు ప్రజా ప్రతినిధులు, వార్డు సభ్యులు, అధికారులు, గ్రామ ప్రజలతో కలిసి ఈ కార్యక్రమాన్ని కొనసాగించనున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా సర్పంచ్ గజ్జల సృజన రమేష్ మాట్లాడుతూ “గ్రామ శుభ్రత ఒకరోజు కార్యక్రమం కాదు, ఇది నిరంతర ప్రక్రియ. ప్రతి ఇంటి వద్ద శుభ్రత పాటించడం, చెత్తను క్రమబద్ధంగా పారవేయడం ద్వారా స్వచ్ఛమైన వంగర ను నిర్మించగలం. ప్రజల సహకారం లేకుండా అభివృద్ధి సాధ్యం కాదు” అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఓలాల రమేష్ వార్డ్, నెంబర్లు మారం సతీష్ మిడిదొడ్డి తిరుపతి, రమేష్, కాల్వ అంజలి రామారావు,స్వరూప పారిశుద్ధ్య కార్మికులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

