బీర్కూర్, రాజముద్ర న్యూస్:
బీర్కూర్ మండలంలోని కిష్టాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు నిర్మాణానికి సంబంధించిన వ్యవహారం ప్రస్తుతం గ్రామంలో చర్చనీయాంశంగా మారింది. కల్ల సునీత భర్త సాయిలు పేరుతో మంజూరైన ఈ ఇల్లు, స్థలం వివాదంలో ఉన్నప్పటికీ నిర్మాణం కొనసాగడం అనేక అనుమానాలకు తావిస్తోంది.
స్థలం వివాదంలో ఉందని పలుమార్లు గ్రామపంచాయతీకి ఫిర్యాదులు అందినప్పటికీ, గ్రామపంచాయతీ సెక్రటరీ శ్రీనివాస్ , సిబ్బంది గంగా గౌడ్, నాయకులు గంగోండ ఈ విషయాన్ని పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు. ఇల్లు నిర్మాణ పనులు ఆపాలని పలుమార్లు అప్లికేషన్లు ఇచ్చినా, వాటిని విస్మరించి పనులు కొనసాగించేందుకు అనుమతించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అంతేకాకుండా, వివాదం ఇంకా పరిష్కారం కాకముందే ఇల్లు బేస్మెంట్ దశ వరకు నిర్మాణం పూర్తయ్యేలా చేసి, ఆ ఫోటోలను అధికార యాప్లో అప్లోడ్ చేసి సుమారు ఒక లక్ష రూపాయల బిల్లు మంజూరు చేయించడం మరింత అనుమానాలకు దారితీస్తోంది. సాధారణంగా ఇలాంటి కేసుల్లో విచారణ పూర్తయ్యే వరకు పనులు నిలిపివేయాల్సి ఉండగా, ఈ విషయంలో మాత్రం అధికారులు అసాధారణ ఉత్సాహం చూపినట్లు కనిపిస్తోంది.
ఇందిరమ్మ ఇల్లు పథకం పేదలకు ఇల్లు కల్పించడమే లక్ష్యంగా ఉన్నప్పటికీ, ఇలాంటి వివాదాస్పద సందర్భాల్లో నిబంధనలు పక్కనపెట్టి ముందుకు సాగడం పథక నమ్మకాన్ని దెబ్బతీస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ప్రశ్నలు తలెత్తుతున్నాయి:
వివాదం ఉన్న స్థలంలో నిర్మాణానికి అనుమతి ఎందుకు ఇచ్చారు?
ఫిర్యాదులను ఎందుకు పట్టించుకోలేదు?
బేస్మెంట్ దశలోనే బిల్లు మంజూరు చేయడానికి కారణం ఏమిటి?
ఇందులో ఎవరైనా ప్రభావం లేదా ఒత్తిడి ఉందా?
ఈ అంశంపై ఉన్నతాధికారులు స్పందించి పూర్తి స్థాయి విచారణ చేపట్టాలనికోరుతున్నారు. సంబంధిత అధికారుల పాత్రపై పారదర్శకత అవసరమని వారు అంటున్నారు. నిన్న సాయంత్రం దర్వాజాలు పెట్టకుండా దరఖాసిస్తే కూడా దరఖాస్తును పక్కన పడేసి, ఈరోజు దర్వాజాలు పెట్టుకోవడానికి అనుమతించారు. ఇది మన అధికారుల పనితీరు.
