Bheemadevarapally, Kothapally: ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ను తనిఖీ చేసిన డిఎంహెచ్వో

కొత్తపల్లి ఆరోగ్య ఉప కేంద్రాన్ని వంగర నుండి ముల్కనూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి మార్చాలి
ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ను తనిఖీ చేసిన డిఎంహెచ్వో
కొత్తపల్లి ఆరోగ్య ఉప కేంద్రాన్ని వంగర నుండి ముల్కనూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి మార్చాలి
భీమదేవరపల్లి రాజముద్ర డెస్క్:
హనుమకొండ డిఎంహెచ్వో(DMHO) డాక్టర్ ఏ అప్పయ్య బుధవారం నాడు వంగర ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని కొత్తపల్లి ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని పరిశీలించారు. కొత్తపల్లి గ్రామంలో 30 సంవత్సరముల పైబడిన వారిని స్క్రీనింగ్ చేసిన వివరాలను పరిశీలించారు. మొత్తం 3129 మందిని స్క్రీన్ చేయడం జరిగితే ఆన్లైన్లో సమస్య వలన అందరి వివరాలు నమోదు కాలేదని ఆరోగ్య సిబ్బంది జిల్లా వైద్యాధికారి దృష్టికి తీసుకురావడం జరిగింది. ఉపకేంద్ర పరిధిలో గుర్తించిన 298 బిపి,186 షుగర్ వ్యాధిగ్రస్తులు అలాగే ఇద్దరు టీబి వ్యాధిగ్రస్తులకు సరైన ఫాలోఅప్ సేవలు అందించాలని సిబ్బందికి సూచించారు. ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ లో ఇటీవల కొనుగోలు చేసిన మిని రిఫ్రిజిరేటర్ ను పరిశీలించారు. మిని రిఫ్రిజిరేటర్ అందుబాటులో ఉన్నట్లయితే వ్యాక్సిన్ లను ఇక్కడనే భద్రపరచడం వలన ప్రజలు ముల్కనూర్, వంగరకు పోవాల్సిన ఇబ్బంది ఉండదు అన్నారు. జిల్లా కలెక్టర్ అనుమతితో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ లో మినీ రిఫ్రిజిరేటర్ అందుబాటులో ఉంచుకోవాల్సిందిగా వైద్యాధికారులకు సూచించడం జరిగిందన్నారు. ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ భవన నిర్మాణ స్థలానికి సంబంధించిన సమస్యలను వారిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కొందరు గ్రామస్తులు తమ యొక్క కొత్తపల్లి ఆరోగ్య ఉప కేంద్రాన్ని వంగర నుండి ముల్కనూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి మార్చాల్సిందిగా కోరడం జరిగింది. కొత్తపల్లి నుండి వంగర పిహెచ్సికి వెళ్లాలంటే ఇబ్బందికరంగా ఉందని వారు తెలియజేశారు. ఈ అంశాన్ని పరిశీలించడం జరుగుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో డా. దినేష్, జిల్లా మాస్ మీడియా అధికారి వి. అశోక్ రెడ్డి, ఏఎన్ఎం హేమలత, ఆశాలు పాల్గొన్నారు.